టాలీవుడ్ ప్రముఖ నటి సమంత త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకోనున్నారు, అంతేకాకుండా నేడు కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఈ పెళ్లి జరుగుతుందనే ప్రచారం మరింత వేగం పెంచుకుంది. సోషల్ మీడియాలో వేగంగా పాకుతున్న ఈ రూమర్స్కు తోడు, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
శ్యామాలి తన ఇన్స్టా స్టోరీలో “Desperate people do desperate things” అనే అర్థం వచ్చే కోట్ను పంచుకున్నారు. సమంత–రాజ్ వివాహ వార్తలు అగ్గి రాజేసిన సందర్భంలోనే ఈ పోస్ట్ బయటకు రావడంతో, ఇది వారిని ఉద్దేశించిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నారన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి సిరీస్లలో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సమంతకు సద్గురు జగ్గీ వాసుదేవ్పై ఉన్న విశ్వాసం, ఈశా ఫౌండేషన్తో వ్యక్తిగత అనుబంధం కారణంగానే అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వార్తలపై సమంతగానీ, రాజ్ నిడిమోగారిగానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇవన్నీ సోషల్ మీడియా వదంతులేనా? లేక నిజంగానే కోయంబత్తూరులో పెళ్లి జరుగుతుందా? అన్నదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.



