వివాహ బంధం… మూడు ముళ్లతో మొదలై, ఏడడుగుల నడకతో బలపడే ఈ పవిత్ర సంబంధం ఇటీవలి కాలంలో క్షణాల్లో చెల్లాచెదురవుతోంది. ప్రేమతో మొదలైన దాంపత్య జీవితం అనుమానాల దెబ్బకు హింసగా మారిపోవడం దేశవ్యాప్తంగా సాధారణమైపోయింది. కొన్నిసార్లు అనుమానమే ఆయుధమై, ఇంటి శాంతి క్షణాల్లో రక్తపాతం కథగా మారుతోంది. అలాంటి మరో హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగుచూసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీసింది.
అనుమానం పేరుతో భర్త చేసిన దారుణం
కోయంబతూరులో చోటుచేసుకున్న ఈ కేసులో తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్–శ్రీప్రియ దంపతులు ప్రధాన పాత్రధారులు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగం నిమిత్తం శ్రీప్రియ కోయంబతూరులోని ఓ మహిళల వసతిగృహంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం బాలమురుగన్లో పెరుగుతూ వచ్చింది. ఆ అనుమానం చివరకు అతి ఘోరంగా మారింది. ఘటన జరిగిన రోజు హాస్టల్కు వచ్చిన బాలమురుగన్, “ఇంటికి రండి” అని పిలిచాడు. కానీ మాట మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ సమయంలో ముందే ప్లాన్ చేసినట్టుగా వెంట తెచ్చుకున్న కొడవలిని తీసి, భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడికక్కడే నరికి చంపేశాడు.
శవం పక్కన కూర్చొని సెల్ఫీ… ‘ద్రోహానికి మూల్యం ఇదే’ అని స్టేటస్
దారుణానికి పరాకాష్ట అక్కడితో ఆగలేదు. భార్య శవం రక్తపు మడుగులో పడి ఉండగా, నిందితుడు శవం పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోను స్టేటస్గా పెట్టి… “ద్రోహానికి మూల్యం చెల్లించాల్సిందే” అన్న వాక్యాన్ని క్యాప్షన్గా రాశాడు. ఆ సెల్ఫీ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భార్యను హత్య చేసిన అనంతరం కూడా అక్కడినుండి వెళ్లకుండా, పోలీసులు వచ్చే వరకు అదే ప్రదేశంలో కూర్చున్నాడు బాలమురుగన్. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వివాహేతర సంబంధ అనుమానమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు విచారణాధికారులు తెలిపారు.
ఈ సంఘటన మరోసారి నిరూపించింది — అనుమానం అనే నిప్పు ఒక్క కుటుంబాన్నే కాదు, మూడు పిల్లల భవిష్యత్తుని కూడా బూడిద చేస్తుందనేది.



