జమ్మూ కశ్మీర్ను మరోసారి విషాదం కమ్మేసింది. శ్రీనగర్ సమీపంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించి ప్రాంతం మొత్తం కుదేలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడు మంది మృతి చెందగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు. మరిన్ని శవాలు వెలికితీసే అవకాశం ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మృతదేహాలను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు తరలించగా, కొందరి గాయాల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
300 అడుగుల దూరం వరకూ శరీర భాగాలు
పేలుడు తీవ్రత యంతటి ఉందంటే, దాని ప్రభావం 300 అడుగుల పరిధి వరకు కనిపించింది. రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు ఎగసి పడి, దట్టమైన పొగ మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేసిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఫోరెన్సిక్ బృందాల పరిశీలన
పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఇటీవల ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న సమయంలోనే ఈ భారీ పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న మొత్తం 360 కిలోల పేలుడు పదార్థాల్లో ఎక్కువ భాగం నౌగామ్ పోలీస్ స్టేషన్లోనే తాత్కాలికంగా నిల్వ చేసినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక FIR కూడా ఇదే స్టేషన్లో నమోదైందని విచారణ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైంది. అధికారులు భద్రతా ప్రమాణాలు, పేలుడు పదార్థాల నిల్వ విధానం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.



