బీహార్ రాజకీయాల్లో ఈసారి ఓ చరిత్ర సృష్టితమైంది. ప్రముఖ జానపద గాయని, సోషల్ మీడియా సెన్సేషన్ మైథిలీ ఠాకూర్ అత్యంత పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. కోట్లాది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె, సంగీత రంగంలోనే కాదు, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
ప్రముఖ ఆర్జేడీ నాయకుడు వినోద్ మిశ్రాపై మైథిలీ దాదాపు 11,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న ఆమె, చిన్న వయసులోనే జానపద గానాలకు నూతన జీవం పోసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది.
సంస్కృతి, భాష, కవిత్వం, సంప్రదాయాల పరిరక్షణలో మైథిలీ ఇప్పటికే అనేక వేదికలపై సేవలందిస్తున్నారు. గతేడాది ఆమె పాడిన శబరి గీతాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రశంసించిన విషయం తెలిసిందే. ‘’మిథిలా కుమార్తె’’గా తనను తాను పలుసార్లు వర్ణించుకొన్న మైథిలీ, యువతలో అపారమైన క్రేజ్ కలిగిన ఇన్ఫ్లూయెన్సర్గా నిలిచారు.
బీజేపీ కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న సంకల్పంలో మైథిలీ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె పాడిన ‘ఏ రాజా జీ’ పాట ఇప్పటికీ వైరల్గా నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదే పాటను నితీశ్ కుమార్పై పాడి మరోసారి వార్తల్లో నిలిచారు. అలీనగర్ నియోజకవర్గాన్ని ‘‘సీతాపుట్’’గా పేరు మార్చుతానని ఆమె ఇప్పటికే ప్రకటించడం ఆసక్తికర అంశంగా మారింది.
మైథిలీ ఠాకూర్ – ముఖ్య వివరాలు
- వయసు: 25
- మొత్తం ఆస్తులు: రూ. 3.8 కోట్లు
- విద్యార్హత: గ్రాడ్యుయేట్
- కేసులు: ఏవీ లేవు
- USP: సాంస్కృతిక ఐకాన్, యువతలో విపరీతమైన క్రేజ్, ప్రభావశీల ఇన్ఫ్లూయెన్సర్



