ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఉల్లి రైతుల అకౌంట్లలో రూ.50 వేల చొప్పున జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అందింది. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హెక్టారుకు రూ.50 వేల చొప్పున సహాయం అందించనుంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

ఈ ఆర్థిక సహాయం ఈ-పంట ఆధారంగా అందజేయబడనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు నేరుగా ప్రయోజనం లభించనుంది.

ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారిని రక్షించేందుకు ముందుకు వచ్చింది. మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్‌ ఇప్పటికే కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేసి, మొత్తం రూ.18 కోట్లు వెచ్చించాయి. వీటిలో రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగతా రూ.8 కోట్లు కూడా త్వరలో అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఈసారి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉల్లి ధరలు క్వింటాకు రూ.600 కంటే ఎక్కువగా లభించలేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 చొప్పున సుమారు 1.39 లక్షల క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. కర్నూలు మార్కెట్ యార్డ్‌లోకి వచ్చిన ఉల్లిని మొత్తం సేకరించి, కొంతమందికి రైతు బజార్లు, వ్యాపారుల ద్వారా విక్రయించే అవకాశం కల్పించింది.

అయినా కొంతమంది రైతుల వద్ద ఉల్లి నిల్వలుగా మిగిలినట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆ రైతుల నష్టాలను సమీక్షించి హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో సాయం నేరుగా జమ కానుంది. ఈ చర్యతో రైతులు కొంత ఊరట పొందనున్నారు.


Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి