గుంటూరు బంగారం షాపుల్లో BIS దాడులు – నాణ్యతలేని నగల విక్రయం వెలుగులోకి, వినియోగదారుల ఫిర్యాదులతో అలర్ట్ అయిన అధికారులు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి పరిధిలోని గుంటూరు నగరంలో బంగారం దుకాణాలపై అక్రమాల ఆరోపణలు పెరుగుతుండటంతో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. గురువారం ఉదయం నుండి గుంటూరులోని పలు బంగారు దుకాణాల్లో బీఐఎస్ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.

ప్రజల నుండి వచ్చిన నగల నాణ్యత లోపాలు, నకిలీ హాల్‌మార్క్‌ నగల విక్రయం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. తనిఖీల్లో పలు దుకాణాల్లో హాల్‌మార్క్‌ ఉల్లంఘనలు, నాణ్యతలేని బంగారు నగల విక్రయం, తప్పుడు బరువులతో మోసాలు బయటపడ్డాయి. దీనితో అధికారులు షాక్‌కు గురయ్యారు.

గుంటూరులోని లాలాపేట ప్రాంతంలోని బంగారం షాపుల్లో ఈ అక్రమాలు స్పష్టంగా బయటపడగా, BIS అధికారులు దుకాణ నిర్వాహకులను ప్రశ్నించి, నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు పేర్కొంటూ –

“వినియోగదారులను మోసం చేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. హాల్‌మార్క్‌ లేని లేదా నాణ్యతలేని నగల విక్రయాన్ని సహించం,” అని హెచ్చరించారు.

అలాగే, బీఐఎస్ బృందం వినియోగదారులకు సూచిస్తూ,

“బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్‌ సర్టిఫికేషన్‌ ఉందో లేదో తప్పనిసరిగా చెక్‌ చేయండి. నాణ్యతను రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి,” అని సూచించింది.

ఈ దాడులతో గుంటూరు నగరంలోని బంగారం వ్యాపార వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇకపై ఇలాంటి తనిఖీలు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా జరగనున్నట్లు BIS వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి