తుఫాన్ కానీ భూకంపం కానీ — ప్రతి ప్రకృతి విపత్తుకీ ఒక ప్రారంభ కేంద్రం (Starting Point) ఉంటుంది. ఆ కేంద్రం నుంచే ప్రకృతి తన ప్రభావాన్ని విస్తరించుతుంది. ప్రస్తుతం ఆంధ్ర తీరాన్ని వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్ కూడా బంగాళాఖాతంలో తన “కన్ను (Eye of the Cyclone)” తెరచి విరుచుకుపడుతోంది.
తుఫాన్లోని ఈ “కన్ను” అంటే అసలు ఏమిటి? తుఫాన్ కేంద్రంగా పరిగణించే ఆ ప్రాంతాన్ని Eye అంటారు. అది రూపంలో నిజంగా కన్నులాగా ఉంటుంది — మధ్యలో ప్రశాంతంగా, చుట్టూ ఉధృత గాలులు, ఉరుములు, మెరుపులతో ఉధృత అలజడిగా ఉంటుంది. అక్కడి ప్రశాంతత ఎంత మోసపూరితమో తెలుసుకోవడానికి వందల కిలోమీటర్ల దూరంలో జరిగే విధ్వంసమే సాక్ష్యం.
తుఫాన్ బలపడిన కొద్దీ ఈ Eye మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది 10 నుండి 20 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. కానీ తీవ్ర తుఫాన్లలో మాత్రం ఇది 40–60 కిలోమీటర్ల వరకు పెద్దదవుతుంది. ఉదాహరణకు, 2014లో విశాఖను వణికించిన ‘హుద్హుద్ తుఫాన్’ Eye సైజు 44–66 కి.మీ. మాత్రమే ఉండేది. అయితే 1979 మేలో ఏపీని తాకిన ఒక తుఫాన్ మాత్రం 425 కి.మీ. పరిధిలో ప్రభావం చూపి చరిత్ర సృష్టించింది.
తుఫాన్ కేంద్రం (Eye) దాటిన తర్వాతే అసలైన విలయం మొదలవుతుంది. ఎందుకంటే, తుఫాన్ ముందుభాగంలో గాలులు విరుచుకుపడతాయి. Eye దాటే సమయం తాత్కాలిక ప్రశాంతత తీసుకొస్తుంది. కానీ ఆ ప్రశాంతత తర్వాత వచ్చే రెండో దశే అత్యంత ప్రమాదకరం — అప్పుడు గాలుల దిశ మారి మరింత వేగంతో విరుచుకుపడతాయి.
తుఫాన్ తీవ్రతను నిర్ణయించేది ఆ Eye విస్తీర్ణమే. అది ఎంత పెద్దదో, అంత పెద్ద పరిధిలో వర్షాలు, గాలులు, ఉరుములు, మెరుపులు కొనసాగుతాయి. తుఫాన్ తీరానికి చేరువయ్యే కొద్దీ గాలి వేగం పెరుగుతుంది. తీరం తాకిన తర్వాత కొంత సేపు ప్రశాంతత కనిపించినా — ఆ తర్వాతే అసలు దాడి మొదలవుతుంది.
ఇప్పుడు ఆంధ్ర తీరాన్ని బెదిరిస్తున్న ‘మొంథా’ తుఫాన్ కూడా అదే దశలో ఉంది. దీని Eye స్పష్టంగా రూపం దాల్చడంతో వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర అప్రమత్తత సూచిస్తున్నారు. ఈ Eye ఎంత విశాలంగా ఉందో బట్టి తుఫాన్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అర్థం అవుతుంది.
తుఫాన్ చుట్టూ ఉన్న మేఘాలు, భారీ వర్షాలు, మెరుపులు — అన్నీ ఈ Eye చుట్టూ తిరుగుతాయి. ఈ కేంద్రం ఎంత బలంగా ఉందో, తుఫాన్ అంత శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి “మొంథా” ప్రభావం ఇప్పుడే మొదలైందనిపించినా… దాని అసలు దెబ్బ Eye దాటిన తర్వాతే తెలుస్తుంది.



