సముద్రం నడిబొడ్డులో ఉన్న ఓ భయంకరమైన పాయింట్
ఈ భూమిపై మూడు వంతులు నీరు.. ఒక వంతు నేల మాత్రమే. జీవరాశులకు అనువైన ఆక్సిజన్ ఉన్న ఏకైక గ్రహం భూమే. మనిషి నీటి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. కానీ అదే సముద్రం మనిషిని పూర్తిగా మింగేసే ప్రదేశం కూడా కలదు. అదే నిమో పాయింట్.
నిమో పాయింట్ ఎక్కడ ఉంది?
నిమో పాయింట్ అంటే Oceanic Pole of Inaccessibility. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. భూమిపై ఏ భూభాగం నుంచైనా దీన్ని చేరుకోవాలంటే కనీసం 2,688 కిలోమీటర్లు ప్రయాణించాలి. దీని సమీప భూభాగాలు డూసీ ద్వీపం, మహేర్ ద్వీపం, మోటు నుయ్ ద్వీపాలు. ఇక్కడ మానవ సంచారం అసాధ్యం.
ఈ ప్రదేశం ఎందుకు ప్రమాదకరం?
- ఇది నౌకాయాన మార్గాలకు దూరంగా ఉంటుంది. అందువల్ల సహాయం పొందడం అసాధ్యం
- బలమైన గాలులు, 15-18 మీటర్ల ఎత్తైన కెరటాలు కనిపిస్తాయి
- జీవవైవిధ్యం తక్కువగా ఉండటం వలన ఆహారం దొరకదు
- ఇది సముద్రంలో 4,000-6,000 మీటర్ల లోతులో ఉండే అబిస్సల్ జోన్లో ఉంటుంది. ఇక్కడ జీవితం సాధ్యం కాదు
ఈ కారణాల వలన, ఈ ప్రదేశంలో ఒక్కరు చిక్కుకున్నా బయటపడటం కష్టమే.
నిమో పాయింట్ – ఉపగ్రహాల శిథిలాల శ్మశానం
నిమో పాయింట్ శాస్త్రీయంగా కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బహుళ అంతరిక్ష సంస్థలు పాత ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల శిథిలాలను భూమిపై పడేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని లక్ష్యంగా చేస్తాయి. దీనిని స్పేస్క్రాఫ్ట్ స్మశానం అని కూడా పిలుస్తారు.
ఇక్కడ పడిన శిథిలాల్లో రష్యా యొక్క మిర్ స్పేస్ స్టేషన్, అమెరికా మరియు ఇతర దేశాల కార్గో ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పటివరకు 260కి పైగా శిథిలాలు ఇక్కడకు దించబడ్డాయి.
నిమో పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈ ప్రదేశానికి “నిమో” అనే పేరు ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్న్ రచించిన నవల 20,000 లీగ్స్ అండర్ ది సీ లోని కెప్టెన్ నిమో పాత్ర నుంచి వచ్చింది. లాటిన్లో “నిమో” అంటే “ఎవరూ లేని” అని అర్థం.



