హైదరాబాద్: అత్యంత భావోద్వేగమైన సంతాన సంపాదన లక్ష్యంగా నడుస్తున్న ఫెర్టిలిటీ ప్రక్రియను కొందరు వ్యాపారంగా మలచుకుని దుర్వినియోగం చేస్తుండటం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని ‘ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్’ పేరిట నడుస్తున్న స్పెర్మ్, ఎగ్ డొనేషన్ క్లినిక్ పై గోపాలపురం పోలీసులు దాడి చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు దాతలుగా బిచ్చగాళ్లను, రోజు కూలీ పనిచేసే అట్టతగ్గ వర్గాల వారిని ఉపయోగిస్తూ అక్రమంగా వీర్యం, అండాలను సేకరించి పెద్ద మొత్తానికి విక్రయిస్తున్నట్టు తేలింది.
ఎలా వెలుగులోకి వచ్చింది ఈ దందా?
క్లినిక్ యజమాని పంకజ్ సోని మరియు మేనేజర్గా ఉన్న అతని సన్నిహితులు కొందరిని ఏజెంట్లుగా నియమించుకుని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న నిరుపేదలను లక్ష్యంగా చేసుకున్నారు. వారానికి ఒక్కసారి క్లినిక్కు వచ్చి “ఒక చిన్న పని చేస్తే మందులు, బిర్యానీ, డబ్బులు ఇస్తాం” అని చెప్పి మాయలో పడేస్తుండేవారు. వీరిలో కొంతమందికి రూ.500 నుంచి 1000 వరకూ చేతికి పెట్టి పంపించేవారట. ఇదే విధంగా, పేద కుటుంబాల మహిళలను కూడా ఇలాంటి ఆశలతో తీసుకొచ్చి వారినుంచి అండాలు సేకరిస్తుండేవారు. ప్రతిసారి అండాల దానానికి మహిళలకు రూ.20,000 నుంచి రూ.25,000 చెల్లించేవారని తెలుస్తోంది.
నిబంధనల ధజ్జాలు:
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టం ప్రకారం వీర్యం, అండాల దాతలు ఆరోగ్యవంతులు అయి ఉండాలి. వారి వయసు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి ఎటువంటి జన్యు సంబంధిత వ్యాధులు లేవని నిర్ధారించాక మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. పైగా, ఒక్క సారి గర్భధారణ కోసం మాత్రమే ఒక మహిళకు అదే దాత వీర్యం ఉపయోగించాలి. కానీ ఈ క్లినిక్లో మాత్రం ఈ నియమాలు అగణితంగా ఉల్లంఘించబడ్డాయి.
కస్టడీ కోసం పిటిషన్:
ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన గోపాలపురం పోలీసులు, మరింత లోతుగా విచారించేందుకు నిందితులను మళ్లీ కస్టడీకి తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. కేసును పూర్తి స్థాయిలో విచారించి, దేశవ్యాప్తంగా ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించే ఇతర క్లినిక్లపై కూడా నిఘా పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



