నాగర్కర్నూల్:
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం జరిగిన నాలుగు నెలలు గడిచినా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. టన్నెల్లో పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి.
మార్చి 9న పంజాబ్కు చెందిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం వెలికితీయగా, మార్చి 25న ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే మిగిలిన ఆరుగురి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు.
ప్రమాద ప్రాంతాన్ని ‘నో-గో జోన్’గా ప్రకటించిన అధికారులు
SLBC టన్నెల్ మొత్తం 43.93 కిలోమీటర్ల పొడవుండగా, ప్రమాదం ఇన్లెట్ టన్నెల్లో 13.85వ కిలోమీటర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో TBM 120 మీటర్ల పొడవు, 10 మీటర్ల వ్యాసార్ధంతో ముందుకు సాగుతుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. భారీగా నీరు, మట్టిస్దిబ్బలు, శిథిలాలు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఈ ప్రాంతాన్ని అధికారికంగా ‘నో-గో జోన్’గా ప్రకటించారు. చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు నిపుణుల బృందాలు తెలిపాయి.
12 కీలక సంస్థలు రంగంలోకి.. 60 రోజుల సహాయక ఆపరేషన్
ఆపరేషన్ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, జీఐఎస్ఐ వంటి 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలు రంగంలోకి దిగాయి. వెయ్యిమందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేశారు. మానవ అవశేషాల కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి ట్రైన్డ్ డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించారు. అయినప్పటికీ చివరి 43 మీటర్ల విభాగంలో భారీ అవాంతరాల కారణంగా ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
సర్వేలు, పునఃప్రారంభానికి సన్నాహాలు
ప్రస్తుతం సొరంగ పనుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) కోసం అవసరమైన భాగాలను అమెరికా నుంచి దిగుమతి చేశారు. జూలై రెండో వారంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ‘డ్రిల్ అండ్ బ్లాస్ట్’ (DBM) పద్ధతిలో తవ్వకాలు జరిపే ఆలోచన కూడా ఉందని సమాచారం.
మృతదేహాల లభ్యతపై అనుమానాలు
ఇప్పటికే నాలుగు నెలలు గడిచినప్పటికీ, మిగిలిన ఆరుగురి మృతదేహాల ఆచూకీ కనుగొనడం క్లిష్టంగా మారింది. ప్రమాద స్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. అయితే బాధిత కుటుంబాల నిరీక్షణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.