భారతదేశ తొలి హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో ఒక కీలక ముందడుగు పడింది. అహ్మదాబాద్-ముంబయి హై స్పీడ్ రైల్ కారిడార్లో అత్యాధునిక సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) రూ.4,100 కోట్ల విలువైన కాంట్రాక్టును సీమెన్స్ ఆధ్వర్యంలోని కన్సార్టియంకి అప్పగించింది.
ఈ కన్సార్టియంలో సీమెన్స్ లిమిటెడ్, సీమెన్స్ మొబిలిటీ జీఎంబీహెచ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కాంట్రాక్టులో భాగంగా, సీమెన్స్ సంస్థ ఈటీసీఎస్ లెవెల్ 2 ఆధారిత సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపేందుకు వీలు కల్పించే టెక్నాలజీ.
15 ఏళ్ల మెయింటెనెన్స్తో పాటు ఆధునిక సాంకేతికత
సీమెన్స్ విడుదల చేసిన ప్రకటనలో, ఈ కాంట్రాక్ట్ విలువ సుమారుగా ₹4,100 కోట్లు అని వెల్లడించింది. ఇందులో సీమెన్స్ లిమిటెడ్ వాటా ₹1,230 కోట్లు. ఈ ప్రాజెక్ట్లో డిజైన్, ఇన్స్టాలేషన్, కమీషనింగ్, అలాగే 15 సంవత్సరాల పాటు నిర్వహణ సేవలు కూడా భాగంగా ఉంటాయి.
ఈ సిస్టమ్ ద్వారా:
- రియల్ టైమ్ మానిటరింగ్
- నాన్స్టాప్ వైర్లెస్ కనెక్టివిటీ
- కేంద్రీకృత ట్రాఫిక్ కంట్రోల్
వంటి సదుపాయాలు లభించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్న ETCS Level 2 సిస్టమ్ను భారత్లో అమలు చేయడం గర్వకారణంగా నిలుస్తోంది.
మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి బలమైన మద్దతు
ఈ ప్రాజెక్ట్ను 54 నెలల్లో పూర్తి చేయాలని, అనంతరం 15 సంవత్సరాల పాటు సీమెన్స్ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుందని అధికారిక ప్రకటన వెల్లడించింది.
సీమెన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO సునీల్ మాథుర్ మాట్లాడుతూ, “మేం మేక్ ఇన్ ఇండియాకు కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలో హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ విస్తరణకు బలమైన పునాది పడుతుంది,” అని పేర్కొన్నారు.