న్యూఢిల్లీ: యూనిఫాం లేకుండా, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అధికారిక విధుల్లో ఉన్నట్లు భావించలేమని, వారి చర్యలు చట్టపరమైన అరెస్టు కిందకు రాదని స్పష్టం చేసింది.
2015 జూన్ 16న పంజాబ్లోని అమృత్సర్ వద్ద జరిగిన నకిలీ ఎన్కౌంటర్ కేసులో 9 మంది పోలీసులపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. డీసీపీ పరమ్పాల్ సింగ్ సహా పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి యత్నించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను కూడా విచారణకు లోబరచాలని ధర్మాసనం ఆదేశించింది.
ఘటన వివరాలు:
2015 జూన్ 16న సాయంత్రం 6.30 గంటల సమయంలో ముఖ్జీత్ సింగ్ అనే వ్యక్తి తన హ్యూండాయ్ i-20 కారులో వెళ్తుండగా, బొలేరో, ఇన్నోవా, వర్నా కార్లలో వచ్చిన 9 మంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. వారంతా సివిల్ దుస్తుల్లో ఉన్నారు. తుపాకులతో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముఖ్జీత్ అక్కడికక్కడే మరణించాడు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తులు వెంటనే స్థానికులను అప్రమత్తం చేశారు. తరువాత భారీగా ప్రజలు అక్కడికి చేరుకోవడంతో, డీసీపీ పరమ్పాల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని కార్ల నంబర్ ప్లేట్లను తొలగించమని సిబ్బందికి ఆదేశించారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, నకిలీ ఎన్కౌంటర్ కేసుగా నమోదు అయింది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ కేసును రద్దు చేయడానికి 2019 మే 20న నిరాకరించింది. అనంతరం ఈ కేసులో ఉన్న 9 మంది పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు స్పష్టత:
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ కేసును విచారించి, ఏప్రిల్ 29న కీలక తీర్పు ఇచ్చింది. దానిలో, డీసీపీతో పాటు ఇతర పోలీసులపై ప్రాసిక్యూషన్ జరిపేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. విధి నిర్వహణ పేరుతో న్యాయాన్ని భంగం చేసే చర్యలను సమర్థించలేమని ధర్మాసనం హితవు పలికింది.
ఈ తీర్పు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయబడింది.